విందుకు హాజరైన సీఎం కేసీఆర్‌

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గౌరవార్ధం రాష్ట్రపతి కోవింద్‌ ఇచ్చిన విందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు హాజరయ్యారు. ఈ విందుకు కేవలం తొమ్మిది రాష్ట్రాల ముఖ్యమంత్రులను మాత్రమే ఆహ్వానించారు. రాష్ట్రపతి ఆహ్వానం మేరకు విందులో పాల్గొనడానికి సీఎం కేసీఆర్‌ మంగళవారం మధ్యాహ్నం హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి వెళ్లారు. ఆయన వెంట ఎంపీ కే కేశవరావు తదితరులున్నారు. ఢిల్లీకి వచ్చిన సీఎంకు తెలంగాణ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ తదితరులు స్వాగతం పలికారు. రాత్రి రాష్ట్రపతి భవన్‌లో ఇచ్చిన విందులో కేసీఆర్‌ పాల్గొన్నారు. విందు సందర్భంగా రాష్ట్రపతి కోవింద్‌ సీఎం కేసీఆర్‌ను ట్రంప్‌కు పరిచయం చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ ట్రంప్‌తో ముచ్చటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ బుధవారం హైదరాబాద్‌కు తిరిగి వచ్చే అవకాశం ఉన్నది.